అక్రమ రేషన్ బియ్యాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి మిత్ర బృందం
ప్రతిఘటన, ఎల్బీనగర్ ప్రతినిధి :
టీపీసీసీ అధికార ప్రతినిధి, లింగోజిగూడ తాజా మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్రె డ్డి కి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో లింగోజిగూడ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారని స్థానిక కాలనీవాసులు సమాచారం అందించారు. ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి సూచనల మేరకు కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి మిత్ర బృందం సంఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. అనంతరం విషయం టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డికి తెలియజేయగా, ఆయన ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు (డీఎస్ఓ, ఏఎస్ఓ)లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే స్పందించి గోదాముపై దాడి చేసి రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. గురువారం ఉదయం సివిల్ సప్లై ఏఎస్ఓ పుల్లయ్య, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మారయ్య సమక్షంలో మొత్తం బియ్యాన్ని రావిరాల సివిల్ సప్లై కార్యాలయానికి తరలించారు. తనిఖీల్లో సుమారు 23 వేల కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తున్నప్పటికీ, కొంత మంది రేషన్ షాప్ నిర్వాహకులు తక్కువ ధరకు తీసుకుని అధిక ధరలకు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే సంబంధిత రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకొని, అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ లేదా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కందికంటి శ్రీధర్ గౌడ్, మనోజ్ కుమార్, గోవర్ధన్,గౌస్,జూపల్లి ప్రవీణ్,రాజు వెంకట్, శ్రీనాథ్, శివ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
