ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్
తెలంగాణ -కర్ణాటక సరిహద్దులో అక్రమ ఇసుక రవాణకు హద్దులే లేవు. అక్రమార్కులు పగలు రాత్రి అని తేడా లేకుండా దర్జాగా ఇసుకను రవాణ చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య అక్రమ ఇసుక వాహనాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. కర్ణాటక నుంచి ధరూర్, కేటిదొడ్డి సరిహద్దు గ్రామాలలో నిత్యం పట్టపగలే అక్రమ ఇసుక రవాణ నడుస్తోంది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని కృష్ణానదీ తీర ప్రాంతాలైన సజ్జపురం, యాపల్ దిన్నె, గాజులపాడు ప్రాంతాల నుంచి ధరూర్, కేటిదొడ్డి మండలాలకు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరిహద్దు మండలాలో గల నెట్టెంపాడు, ఈర్లబండ, ద్యాగదొడ్డి, నీళ్లహళ్లి, పాతపాలెం, పాగుంటా , వెంకటాపురం, ఇర్కిచేడు , గువ్వలదిన్నె, తదితర గ్రామాలలో అధికారుల నిఘా కరువైందని, దీంతో ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక నుంచి అక్రమ ఇసుక రవాణను అడ్డుకోవల్సిందిగా పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
