జయప్రదం చేయాలని కొండమడుగు నర్సింహా పిలుపు
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్
ఈ నెల 30వ తేదీన సుందరయ్య భవన్, భువనగిరిలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్ షాప్ ను సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహా పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అనేక పోరాటాల ఫలితంగా 2005 లో సాదించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం ఎత్తివేసి వీ బీ – జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చి కూలీల పొట్టలు కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రతి బడ్జెట్ లో నిధులు తగ్గిస్తు కొత్త కొత్త జీఓలు తెచ్చి కూలీల సంఖ్య తగ్గిస్తూ చేసిన పనికి వారవారం డబ్బులు ఇవ్వకుండా, పని ప్రదేశాల్లో మౌలిక వసతులు తగ్గిస్తూ చట్టంలో ఉన్న హక్కులను కూడా తొలగించారని విమర్శించారు. ప్రధానంగా ఈ వర్క్ షాప్ లో పాత ఉపాధి హామీని కొనసాగించాలని, నూతన చట్టాన్ని రద్దు చేయాలని, భూ సమస్యలను పరిష్కరించాలని ఏప్రిల్ 1 నుండి మే 15 వరకు గ్రామ గ్రామాన పర్యటనలు చేసి వ్యవసాయ కూలీలను, ఉపాధి హామీ కార్మికులను కదిలించి ఉద్యమాలు చేపట్టడానికి పోరాట కర్తవ్యాలను రూపొందిస్తామని తెలిపారు. ఈ వర్క్ షాప్ కు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ. నాగయ్య, ఆర్. వెంకట్రాములు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, వ్యవసాయ కార్మిక సంఘం మండల, జిల్లా నాయకత్వం అధిక సంఖ్యలో పాల్గొని వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని నర్సింహా కోరారు.
