రవీంద్ర భారతిలో ఏనుగు నర్సింహారెడ్డి ఐఏఎస్, ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారం
ఉగాది పురస్కారం తో భాద్యత మరింత పెరిగింది
జర్నలిస్ట్ టి. రమేష్
ప్రతిఘటన, రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రతినిధి:
విపంచి ఫౌండేషన్ ఉగాది పురస్కారంను సీనియర్ జర్నలిస్ట్ టి. రమేష్ సోమవారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఏనుగు నర్సింహారెడ్డి ఐఏఎస్ చేతుల మీదుగా ప్రముఖుల సమక్షంలో అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలలో కృషి చేస్తున్న వారికి విపంచి ఫౌండేషన్ ప్రతీ ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పురస్కారానికి సీనియర్ జర్నలిస్ట్ టి. రమేష్ ను విపంచి ఫౌండేషన్ ప్రత్యేక జూరి కమిటీ ఎంపిక చేసింది. పత్రికా రంగంలో టి. రమేష్ చేస్తున్న కృషికి గాను ఈ అవార్డును ప్రకటిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం ) కు చెందిన రమేష్ భువనగిరిలో డిగ్రీ చదువుకున్న సమయం నుండే జర్నలిజం పై ఆసక్తితో పలు పత్రికలో స్థానిక సమస్యలపై స్పందిస్తూ సుమారు 30 సంవత్సరాల నుండి సాహిత్య పరిశోధక వ్యాసాలతో తెలుగు భాషా సాహిత్యానికి తనవంతు సేవలు అందిస్తున్నాడని తెలిపారు. చిన్న వయస్సులోనే సాహితీ మాగాణంలో చెరగని ముద్రను వేసుకున్నాడని కొనియాడారు. జర్నలిస్ట్ టి.రమేష్ నేడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జర్నలిస్ట్ గా పని చేస్తున్నారన్నారు. భవిష్యత్ లో మరిన్ని రచనలు చేసి తెలంగాణకు మరింత ఖ్యాతిని తీసుకురావాలని కాంక్షించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
