స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నాగర్కర్నూల్ జిల్లా జర్నలిస్టుల సమస్యల ప్రస్తావనపై
సానుకూలంగా స్పందించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
నూతనంగా అక్రిడేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తప్పనిసరిగా అక్రిడేషన్ అందేలా చర్యలు చేపడతామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాదులో జరిగిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి విజయ్ కుమార్, సురేష్ కుమార్ హాజరై నాగర్కర్నూల్ జిల్లాకు సంబంధించిన రెండు ప్రధాన సమస్యలను రాష్ట్ర నాయకత్వ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీకి వినతిపత్రాలు అందజేయడంతో పాటు సభా వేదికపై నుంచే సమస్యలను వివరించారు. మొదటి సమస్యగా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అక్రిడిటేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో రంగారెడ్డి జిల్లా చూపిస్తోందని వివరించారు. దీనిపై స్పందించిన నాయకులు ఇది టెక్నికల్ సమస్య అని, రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నల్లమల్ల ప్రాంతంలోని మన్ననూరు, బ్రహ్మగిరి కేంద్రాల్లో మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించి కమిషనర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ వేదికపై నుంచి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మీడియా మిత్రులు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా అధ్యక్షుడు పీ.విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఆర్.సురేష్ కుమార్ తెలిపారు.
