ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
నమ్మించి గొంతు కోయడం అంటే ఇదే. పార్టీ చేసుకుందామని స్నేహితులే పిలిచి పాత కక్షలు మనసులో పెట్టుకుని స్నేహితులే దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సీఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాదె-ఇ-సలేహీన్, షాహీన్ నగర్ కు చెందిన మహమ్మద్ నసీర్ (22) ఎలక్ట్రీషియన్ గా పని చేస్తుంటాడు. ఈ నెల 5న రాత్రి 9 గంటలకు, అతను ఇంట్లో ఉండగా, అతని స్నేహితులు మహ్మద్ దస్తగిర్ , మహ్మద్ సుబానుద్దీన్ అతని వద్దకు వచ్చి, దావత్ చేసుకుందామని రావాలని చెప్పి, యాక్టివా వాహనంపై తీసుకెళ్లారు. రాత్రి 12 గంటల సమయంలో, హబీబ్ హోటల్, వాదే-ఇ-సలేహీన్ మెయిన్ రోడ్ సమీపంలోని ఓపెన్ ప్లాట్లో మహ్మద్ నసీర్ ను కత్తులతో దారుణంగా పొడిచి చంపినట్లు అదే కాలనీకి చెందిన ఒక బాలుడు ఫిర్యాదుదారుడికి సమాచారం అందించాడు. వెంటనే ఫిర్యాదుదారుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ జనం గుమిగూడారు. మృతుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. సిమెంట్ ఇటుకతో కొట్టడం వల్ల తలకు బలమైన గాయాలతో పాటు, మృతుడి శరీరంపై అనేక కత్తిపోట్లు కనిపించాయి. మృతుడికి మెడ, పొత్తి కడుపుపై 6 కత్తిపోట్లు ఉన్నాయి, విచక్షణ రహితంగా పొడిచి చంపినట్లు తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మృతుడి స్నేహితులు మహ్మద్ దస్తగిర్, మహ్మద్ సుబానుద్దీన్, మహ్మద్ ఇలియాస్, మహ్మద్ నదీమ్ ఖాన్ అనే వ్యక్తులు సాధారణ ఉద్దేశ్యంతో మద్యం సేవించి, వ్యక్తిగత కక్షల కారణంగా మృతుడిపై దాడి చేసి విచక్షణా రహితంగా ఇటుకతో కొట్టి, కడుపులో, మెడపై కత్తితో పొడిచి చంపినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
