కొండమడుగు నర్సింహ్మ
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర
- యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలో ఏప్రిల్ 3వ తేదీన సుందరయ్య భవన్ లో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్ షాప్ ను జిల్లా, మండల కమిటీ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా 2005 సాదించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని ప్రధాని మోడీ- బీజేపీ ప్రభుత్వం ఎత్తివేసి వీబీ – జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చి కూలీల పొట్టలు కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రతి బడ్జెట్ లో నిధులు తగ్గిస్తు కొత్త కొత్త జీఓలు తెచ్చి కూలీల సంఖ్య తగ్గిస్తూ చేసిన పనికి వారం వారం డబ్బులు ఇవ్వకుండా, చేసిన పనికి కూలీ ఎంత వస్తుందని తెలిపే పే స్లిప్ లు ఇవ్వక పోవడం, పని ప్రదేశాల్లో మౌలిక వసతులు తగ్గిస్తూ చట్టంలో ఉన్న హక్కులను కూడా తొలగించారని విమర్శించారు. 3న నిర్వహించే ఈ వర్క్ షాప్ లో పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, నూతన చట్టాన్ని రద్దు చేయాలని, భూ సమస్యలను పరిష్కరించాలని ఏప్రిల్ 5 నుండి మే 20 వరకు గ్రామ గ్రామాన పర్యటనలు చేసి వ్యవసాయ కూలీలను, ఉపాధిహామీ కార్మికులను కదిలించి ఉద్యమాలు చేపట్టడానికి పోరాట కర్తవ్యాలను రూపొందిస్తామని తెలిపారు. ఈ వర్క్ షాప్ కు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. నాగయ్య, ఆర్. వెంకట్రాములు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని నరసింహా తెలిపారు.
