prathighatana.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 7:31 pm Digital Edition : PRATHI GHATANA

90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలోనే: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ప్రతిఘటన, హైదరారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే సుమారు 90 శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించబోతోందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ప్రజా పాలన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టణ ఓటర్లు పట్టం కట్టారని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి… ఇవన్నీ కలిపి కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరిచాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, పట్టణాభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు వంటి కార్యక్రమాలు ప్రజల మనసులను గెలుచుకున్నాయని ఆయన వివరించారు.

ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య వ్యవస్థ మెరుగుదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఓటర్లలో సానుకూల భావనను కలిగించాయని చెప్పారు. ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసం భవిష్యత్‌లో మరింత బాధ్యతగా పని చేయాలని సూచిస్తోందని మహేష్ గౌడ్ గారు పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ మద్దతు మా బాధ్యతను పెంచింది. ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్‌లో పారదర్శకతతో, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసిన అసత్యాలు, అవాస్తవాలను ప్రజలు నమ్మలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి నిలబడే ప్రభుత్వమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు, అభ్యర్థులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, పట్టణాల సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ హవాను మరింత బలపరిచాయి. ప్రజా పాలనపై ప్రజల విశ్వాసమే ఈ విజయానికి మూలకారణమని పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది.