ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించేందుకు హెల్మెట్ ధరించడం ప్రతి ద్విచక్ర వాహనదారుని బాధ్యత అని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ శ్రీనివాస్ తెలిపారు. బడంగ్ పేట్ చౌరస్తా వద్ద హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ లేకపోతే జరిమానా మాత్రమే కాదు, ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందన్నారు. హెల్మెట్ ధరించడం 50% వరకు తలకు గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. రోడ్ల పైన మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కోసారి ఎదుటి వారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయని, ఇటువంటి పరిస్థితుల్లో హెల్మెట్ ఉన్నట్లయితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు అన్నారు. ప్రమాదాలను అరికట్టాలంటే కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. ఇష్టానుసారంగా వాహనాలు నడపడం వలన ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయని తెలిపారు . హైదరాబాద్ నగరంలో చాలా వరకు ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారంటే కేవలం హెల్మెట్ ధరించకపోవడమే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వాహనదారులు ఇన్సూరెన్స్ చేసుకోవాలని తెలిపారు. హెల్మెట్లు ధరించడం, బెల్ట్ సరిగా పెట్టుకోకపోవడం వల్ల ప్రమాద సమయంలో హెల్మెట్ ఊడిపోయి, ప్రాణాపాయం కలగవచ్చు. కాబట్టి, నాణ్యమైన హెల్మెట్ మాత్రమే వాడాలని తెలిపారు.