సామ మహేందర్ రెడ్డి
ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య
మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించిన పలు సంక్షేమ పథకాల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంటోందని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి సామ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకానికి సంబంధించిన చెక్కులు వచ్చి మూడు, నాలుగు నెలలు గడిచినా, లబ్ధిదారులకు ఇప్పటికీ అందకుండా ఆలస్యం చేయడం బాధాకరమన్నారు. కక్షపూరిత రాజకీయాల కారణంగా తమ నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీద ఉన్న వ్యక్తిగత ద్వేషంతో చెక్కులు నిలిపివేయడం పూర్తిగా అన్యాయని పేర్కొన్నారు. పేద కుటుంబాల పెళ్లిళ్ల కోసం ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని రాజకీయ కోణంలో చూసి ఆలస్యం చేయడం అమానుషమన్నారు. ఈ విధమైన కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇవ్వని పక్షంలో అవసరమైతే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.