శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడ సేవ
వైభవంగా స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి
ఆలయంలో తిరుప్పావడ సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రాతఃకాలంలో సుప్రభాత సేవతో ఆలయంలో నిత్య కైంకర్యాలు జరిగాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణ గిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం. స్వామి వారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూర మంగళ హారతులు సమర్పించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.
ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.