ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయంలో గురువారం ధ్వజారోహణం, గరుడసేవ, బేరీ పూజలు, ప్రత్యేక హోమం నిర్వహించినట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ తెలిపారు. వేదమూర్తులైన బ్రాహ్మణ అర్చక బృందం చక్రవర్తి శ్రీనివాసచార్యులు, కందాడై శ్రీనివాసచార్యులు వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవత ఆహ్వానం చేశారు. రామాలయ కమిటీ వారిచే విష్ణు సహస్ర పారాయణ పఠనం సామూహికంగా నిర్వహించారు. శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో భక్తులు సేవ చేయుటకు ప్రత్యేక స్టాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళల్లో గరుడవాహన సేవ ఎదుర్కొల్లు, కోలాటం, ప్రత్యేక భజనలు మహిళలు నిర్వహించారు. శుక్రవారం శ్రీరామనవమి ప్రత్యేక పూజలు ఉదయం నుండి ఆలయంలో ప్రారంభమవుతాయని తెలిపారు. సామూహికంగా భక్తులచే శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాలూకా మున్నూరు సంఘం యువత వారిచే పాల్గొన్న భక్తులందరికీ టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఉచిత అన్న ప్రసాద పంపిణీ ఉన్నట్లు తెలిపారు. భక్తులు స్వామి వారికి సమర్పణ నిమిత్తం అక్షింతలు, వడిబియ్యం, వస్త్రాలు, తలంబ్రాలు, పూలు, పండ్లు తమవెంట ఇంటి నుండి తెచ్చుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామనవమి ఉత్సవ కమిటీ సభ్యులు, రామాలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు, భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
