ప్రతిఘటన జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో ప్రతినిధి గడ్డం సుధాకర్
గద్వాల జిల్లా భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత సెల్ మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) సంయుక్తంగా మహిళలపై లైంగిక దాడులు, పోక్సో చట్టంపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మీనాక్షి అధ్యక్షత వహించి మాట్లాడారు.. నేటి సమాజంలో మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, ప్రతి మహిళ తన హక్కులు, చట్టపరమైన రక్షణలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.ఐ తారక మాట్లాడుతూ.. విద్యార్థినులకు మహిళలపై జరిగే నేరాలను ఎలా ఎదుర్కోవాలి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, పోలీస్ శాఖ అందించే సహాయం ఎలా పొందాలి అనే అంశాలను విద్యార్థినులకు వివరించారు. భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ శివాని పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరిస్తూ, బాధితులకు భరోసా సెంటర్ ద్వారా అందించే సేవలు, మద్దతు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ సెల్ కన్వీనర్ ఎం. సమత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి. జగన్ మోహన్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.