భారత తొలి ఏఐ ఆధారిత యాంటీబయోటిక్కు మానవ క్లినికల్ పరీక్షలు
హైదరాబాద్ స్టార్టప్ నుంచి ప్రారంభం
ప్రతిఘటన, తెలంగాణ మెడికల్ రిపోర్టర్ కానుగుల సాయి కిషోర్
దేశంలో తొలిసారిగా హైదరాబాద్కు చెందిన బయోసైన్సెస్ సంస్థ ఎస్సీఐఐఎన్వీ బయో సైన్సెస్ తన స్వంత ఏఐ (కృత్రిమ మేధస్సు) ప్లాట్ఫామ్ సహాయంతో కొత్త యాంటీబయోటిక్ అభ్యర్థిని గుర్తించింది. ఈ ఔషధం ఇప్పుడు మానవ క్లినికల్ ట్రయల్స్కు సిద్ధమైంది. ఇప్పటికే ఇతర వ్యాధుల చికిత్సలో ఉపయోగించిన ఒక మెడికల్ కంపౌండ్ను ఏఐ ఆధారిత డ్రగ్ రీపర్పోజింగ్ విధానం ద్వారా పునర్వినియోగం చేయడం ద్వారా ప్రాణరక్షక యాంటీబయోటిక్గా మారే అవకాశాన్ని సంస్థ గుర్తించింది. ఈ విధానం వల్ల సాధారణంగా ఒక దశాబ్దం పట్టే ఔషధ అభివృద్ధి కాలాన్ని గణనీయంగా తగ్గించగలిగింది.
ఏఐ మరియు డ్రగ్ రీపర్పోజింగ్ను వినియోగించడం ద్వారా మేము ఔషధ ఆవిష్కరణ సమయాన్ని తగ్గించి, క్లినికల్ దశలకు వేగంగా తీసుకెళ్లగలుగుతున్నాం. మానవ పరీక్షల దశలోకి ప్రవేశించడం మా శాస్త్రీయ క్రమశిక్షణకు, సిద్ధతకు నిదర్శనం,” అని ఎస్సీఐఐఎన్వీ బయోసైన్సెస్ ఆర్ & డీ కో-చైర్మన్ డాక్టర్ ఉదయ్ సక్సేనా తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ పరిశోధనల్లో మందగమనం నెలకొన్న నేపథ్యంలో, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అనే తీవ్రమైన సమస్యను ఎదుర్కొనేందుకు ఏఐ ఆధారిత డ్రగ్ రీపర్పోజింగ్ కీలక మార్గంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు.యాంటీబయోటిక్స్కు ప్రతిఘటన పెంచుకున్న ‘సూపర్బగ్స్’ విస్తరిస్తున్న ఈ సమయంలో కొత్త ఔషధాల అవసరం అత్యవసరమైంది.
హైదరాబాద్కు చెందిన ప్రజారోగ్య నిపుణుడు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ సీఐఏ) అధ్యక్షుడు డాక్టర్ రంగారెడ్డి బుర్రి మాట్లాడుతూ, “భారతదేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత రీపర్పోజ్డ్ యాంటీబయోటిక్ మానవ పరీక్షల దశలోకి రావడం యాంటీబయోటిక్ పైప్లైన్ పునరుద్ధరణలో ఒక కీలక మైలురాయనీ, ఇది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ను నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బలాన్నిస్తుందనీ అన్నారు.
ఈ ప్రాజెక్టుకు ఆర్థిక, అభివృద్ధి మద్దతు అందించేందుకు ఎస్సీఐఐఎన్వీ బయోసైన్సెస్ మల్టీ-కోట్ల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని వాలే ట్యాంక్ బయోకేటలిస్ట్ సంస్థతో కుదుర్చుకుంది. మానవ క్లినికల్ ట్రయల్స్ వంటి క్లిష్ట దశలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈ భాగస్వామ్యం దోహదపడనుంది.
వేల్ ట్యాంక్ బయోక్యాటలిస్ట్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ మార్కండేయ గోరంట్ల మాట్లాడుతూ, సాంకేతికత మరియు ప్రజారోగ్య రంగాల కలయికతో రాష్ట్ర అభివృద్ధి రోడ్మ్యాప్కు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని పేర్కొన్నారు.