జిల్లా వ్యాప్తంగా ఈద్గాలలో ప్రత్యేక ప్రార్ధనలు
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, నాయకులు
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా రిపోర్టర్ జంగిటి రవీందర్
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లింలు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మతసామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. ఆ అల్లా చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పలు చోట్ల పోలీసులు ముస్లింల మత ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో రంజాన్ వేడుకలను జరుపుకున్నారు.
*ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు*
భువనగిరి ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, కమిషనర్ రామాలింగంతో పాటు పలువురు నాయకులు ముస్లింలకు శుభాకాక్షలు తెలిపారు.