ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
రాష్ట్రం వివిధ రంగాలలో అభివృద్ధి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుందని కందుకూరు మండల అధ్యక్షుడు మన్నె జయేందర్, కొత్తగూడ గ్రామశాఖ అధ్యక్షుడు నరేందర్ అన్నారు. కందుకూరు మండలంలోని కొత్తగూడ గ్రామంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా కే. చంద్రశేఖర్ రావు చేసిన అభివృద్ధి, అలాగే మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన సేవలను గుర్తించి గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కందుకూరు మండల అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఇతర పార్టీల్లో వారికి సరైన గుర్తింపు లేకపోవడం వల్లే బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే వారికి ఎలాంటి లోటు ఉండదని, వారికి పూర్తి స్థాయిలో గౌరవం, అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. అలాగే కొత్తగా చేరిన వారిని త్వరలోనే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో పరిచయం చేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
