యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో సమిష్టి కృషి తో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీఅక్షాంక్ష్ యాదవ్ అన్నారు. శుక్రవారం పోలీస్ ఏ ఆర్ హెడ్ క్వాటర్స్ అరైవ్ – అలైవ్ కార్యక్రమాల పై జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ,సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లడుతూ రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని సూచించారు. వార్డు సభ్యులు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని అన్నారు. 13వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. అదేవిధంగా రిటైర్డ్ టీచర్లు, డాక్టర్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కూడిన రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఈ కమిటీలో కనీసం ముగ్గురు మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని అన్నారు. ఎక్కడైనా రోడ్ల పక్కన గుంతలు,పాడుబడిన బావులు ఉంటే పూడ్చివేయించాలని, ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. 15వ తేదీన చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డేగా జరపాలని, 4 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్ళే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. మైనర్ లు వాహనాలు నడపకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. స్కూల్ బస్సులు ఫిట్ నెస్ కలిగి ఉండేలా చూడాలన్నారు. 16 తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి, తద్వారా వారు ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలన్నారు. అలాగే, వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 17 వ తేదీన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాలలో తక్షణమే స్పందించి ప్రథమ చికిత్స ఎలా చేయాలి, క్షతగాత్రులను సత్వరమే సమీప ఆసుపత్రికి తరలించడం వంటి వాటి పై అవగాహన కల్పించాలన్నారు. 18వ తేదీన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిని గుర్తిస్తూ, వారికి కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. ఈ నెల 16న మండల స్థాయిలో నిర్వహించే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక సభల్లోనూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రధాన కూడళ్ళలో మానవహారాలు జరపాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, భువనగిరి డిఎస్పి రవీందర్, భువనగిరి ట్రాఫిక్ డిఎస్పి ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ డిఎస్పి మధుసూదన్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారులు ఇమ్రాన్, డిపిఓ శ్రీకాంత్, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, ఇంటర్మీడియట్ అధికారి రమణి, ఆర్ అండ్ బి అధికారి సరిత సంబంధిత అధికారులు పాల్గొన్నారు.