ప్రతిఘటన, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్
చాంద్రాయణగుట్ట పూల్ బాగ్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు మోహనచార్యులు ఆధ్వర్యంలో ఈనెల 27న జరిగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవాలయంలో శనివారం జరిగిన పల్లకి ఉత్సవం ఆలయ చరిత్రలోనే అత్యంత వైభవంగా జరిగింది. రంగు రంగుల పుష్పాలంకృత పల్లకిలో ఉత్సవ మూర్తిని ఉంచి, వేద పండితుల మంత్రోచారణలు, నాదస్వరం మేళతాళాల నడుమ ప్రాంగణం మొత్తం ఊరేగించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మోహన చార్యులు మాట్లాడుతూ.. ఈనెల 27 న జరిగే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రుల స్వామివారికి కుంభ ఆహ్వానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య ఆహ్వానం, శ్రీ లక్ష్మీనారాయణ హోమం, నిత్య పూర్ణాహుతి, శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమం, శ్రీ మహాలక్ష్మి హోమం, శ్రీ సుదర్శన హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 27న శ్రీ సీతరామచంద్ర స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని వెల్లడించారు. కావున కన్నుల పండుగగా జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లెనిన్ బాబు, సభ్యులు, వెంకటేశ్వర్, రెక్కల మురళీధర్, మాజీ చైర్మన్ రమాకాంత్, అర్చకులు మనోహర్ చారి, ధీరజ్ కుమార్ తివారి, భాను రాజ్, ఆదర్శ్ మిశ్రా, పవన్, రాజేందర్, మహేందర్ రెడ్డి, కృష్ణ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.