ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుతో పారిశుద్ధ్య విభాగం బలోపేతానికి, కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడుతుందని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ చంద్రకళ తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ.. గతంలో మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తూ ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు అంశానికి ఆమోదం లభించిందని, ఈ నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు పాత మున్సిపాలిటీ వేతనాల ప్రకారం వేతనాలు పొందుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇకముందు జీహెచ్ఎంసీ వేతనాల ప్రకారం జీతాలు చెల్లించబడతాయన్నారు. ఈ వేతన పెంపు నిర్ణయం పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి, వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు ఎంతో మేలు చేయనుందన్నారు. నగర పరిశుభ్రత, ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలిపారు. శంషాబాద్ జోన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, వారి సేవలు ఇదే విధంగా ప్రజలకు అందించాలని కోరారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం బలోపేతానికి, కార్మికుల సంక్షేమానికి సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. శంషాబాద్ జోన్ పరిధిలో ఆదిబట్ల సర్కిల్ -15 లో 279 మంది, బడంగ్పేట్ సర్కిల్ -16 లో 352 మంది, జల్ పల్లి సర్కిల్ -17 లో 106 మంది, శంషాబాద్ సర్కిల్ -18 లో 313 మంది కార్మికులు లబ్ధి పొందనున్నారని తెలిపారు.