ప్రతిఘటన, జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి గడ్డం సుధాకర్
గద్వాల జిల్లా ధరూర్ మండలం వామన్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు గ్రామ సర్పంచ్ పర్నికా కృపాకర్ రెడ్డి మైక్ సెట్ వితరణ చేశారు. పాఠశాలలో గత కొంత కాలం కిందట మైక్ సెట్ పాడయ్యింది. పాఠశాలలో ఉదయం, సాయంత్రం జరిగే ప్రార్థన కార్యక్రమంలో, పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో మైక్ సెట్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమస్యను గ్రామ సర్పంచ్ పర్నికా కృపాకర్ రెడ్డి దృష్టికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాక్ తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన గ్రామ సర్పంచ్ గురువారం పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్స కార్యక్రమంలో మైక్ సెట్ ను విద్యార్థుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాక్ కు అందజేశారు. అనంతరం సర్పంచ్ పర్నికా కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులలో జాగ్రత్తగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, చల్ల దనం కోసం చుట్టు పక్కల ఉండే చెరువులు, కుంటలకు స్నేహితుల ప్రోద్భలంతో ఈతకు వెళ్లడం లాంటివి చేసి ప్రమాదాలను తెచ్చుకోవద్దని సూచించారు. విద్యార్థులు ఇంటి వద్దనే ఉంటూ పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పాటిస్తూ తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం లో అంగన్ వాడి టీచర్ శోభారాణి, గ్రామ ఉప సర్పంచ్ శిరీష రాజు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.