జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
జిల్లా గ్రంథాలయంలో పాఠకులకు డిజిటల్ లైబ్రరీ సేవలు వెంటనే అందుబాటులోకి తేవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. గ్రంథాలయంలోని పాఠకులను ప్రతి ఒక్కరిని పలకరిస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠకులకు డిజిటల్ లైబ్రరీ సేవలు వీలైనంత తొందరగా అందుబాటులో తేవాలని, వెంటనే ప్రణాళికా రూపొందించాలని అధికారులకు సూచించారు. వాటర్ ప్లాంట్ కొత్తది ఏర్పాటు చేస్తామని పాఠకులకు హామీ ఇచ్చారు. జిల్లాలో శాఖ గ్రంథాలయాలు ఉన్నాయో.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. రామన్నపేట, వలిగొండ, ఆలేరు, తుర్కపల్లి, గ్రంథాలయాలను సందర్శించి వాటి మరమ్మత్తులు చేపట్టేందుకు వెంటనే ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తీ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.సుధీర్ జిల్లా కలెక్టర్ ను శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.