ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
పన్నులు చెల్లించకపోతే ఇక ఉపేక్షించేది లేదని జీహెచ్ఎంసీ జల్ పల్లి డిప్యూటీ కమిషనర్ వెంకట్ రావు సర్కిల్ పరిధిలోని దుకాణదారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జల్పల్లి సర్కిల్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా పన్నులు చెల్లించని బకాయిదారులపై జల్ పల్లి సర్కిల్ అధికారులు చర్యలు చేపట్టారు. పలు మార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో, డిప్యూటీ కమిషనర్ వెంకట్ రావు ఆదేశాల మేరకు ఏఎంసీలు వినయ్ కుమార్, జ్యోతి ఆధ్వర్యంలో షాహీన్ నగర్, బిస్మిల్లా కాలనీ, బాబా నగర్ ప్రాంతాల్లో మొత్తం 15 దుకాణ సముదాయాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. పన్నులు చెల్లించని వారిపై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, భవన యజమానులు అందరూ తమ ఇంటి పన్నులను మార్చి 31వ తేదీ లోపు చెల్లించి, బకాయిలపై 90% వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా బిల్ కలెక్టర్లు రాములు, సురేష్, వినయ్ తో పాటు సిబ్బంది శ్రీశైలం, అలీమ్, నరేందర్, హరీష్, బాలకృష్ణ పాల్గొన్నారు.
