prathighatana.com
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 2:10 pm Digital Edition : PRATHI GHATANA

తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం

ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో రిపోర్టర్ విజయకాంత్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్ మరియు కళాశాల ఏకో క్లబ్,వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల పెంపును ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మదన్ మోహన్ మాట్లాడుతూ.. సీడ్ బాల్స్ అనేవి మట్టి, ఎరువు మరియు విత్తనాలను కలిపి తయారు చేసే గోళాకార బంతులని తెలిపారు. వీటిని ఎండిపోయిన భూములు, అడవి అంచులు మరియు ఖాళీ ప్రదేశాల్లో విసరడం ద్వారా సహజంగా మొక్కలు పెరిగే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. వర్షాకాలంలో సీడ్ బాల్స్ తడిసి మట్టిలో కలిసిపోవడంతో విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయని ఆయన వివరించారు. అదేవిధంగా, చేరుకోవడం కష్టమైన కొండ ప్రాంతాలు, రహదారి పక్కలు మరియు వృక్షావరణం తగ్గిపోయిన ప్రదేశాల్లో సీడ్ బాల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కలను పెంచేందుకు ఇది సమర్థవంతమైన పద్ధతి అని, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పర్యావరణంపై అవగాహన పెంపొందుతుందని ప్రిన్సిపాల్ మదన్ మోహన్ వివరించారు.