యాదగిరిగుట్ట ఏవోకు బీఆర్ఎస్ నేతల వినతి
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన ఓ టెండర్ దేవస్థానానికి తీవ్ర నష్టం జరిగేలా ఉందని తక్షణమే ఆ టెండర్ ను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి ఆధ్వర్యంలో శుక్రవారం యాదగిరిగుట్ట దేవస్థానం ఈ.వో భవాని శంకర్ కు వినతి పత్రం అందజేశారు. కొండ కింద లక్ష్మీ పుష్కరిణి వద్ద 9, 10 నెంబర్లు గల దుకాణాలలో కూల్డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, బనియన్స్, టవల్స్ విక్రయించేందుకు ఇటీవల నిర్వహించిన టెండర్ ను టెండర్దారులు సిండికేట్ గా మారి తక్కువ మొత్తంలో దక్కించుకున్నారని పాపట్ల నరహరి ఆరోపించారు. గతంలో కంటే 75% తగ్గించి తక్కువ మొత్తానికి అద్దెకు ఇవ్వడం వల్ల దేవస్థానం నష్టపోతుందని అన్నారు. దీని వల్ల గతంలో కంటే దేవస్థానానికి తక్కువ ఆదాయం వచ్చి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. దీనిపై విచారణ జరిపి ఆ టెండర్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దేవపూజ అశోక్, మోతే నరసింహా, మిట్ట వెంకటేష్, మోతే బాలు, సర్దార్, మోతే విజయ్, కంసాని స్వామి, మోతే శంకర్, రేఖల రాజు పాల్గొన్నారు.
