డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ స్ఫురితో మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం పోరాడుదాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డీ జహంగీర్
ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
భూమి లేని పేదలందరికీ భూపంపిణీ జరిగి, అందరికి ఉపాధి కల్పించినప్పుడే ఆర్ధిక సమానత్వం వస్తుందని, ఆర్థిక సమానత్వం ద్వారానే కుల నిర్మూలన జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డీ జహంగీర్ తెలిపారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మనువాదానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా “భారత రాజ్యాంగం – సామాజిక న్యాయం” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో ముఖ్య అతిథిగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ.. నాటి రిజర్వేషన్లు పేదలకు కాస్తో కూస్తో విద్యా, వైద్యం, ఉపాధికి ఉపయోగపడుతుందని, కానీ 1991 నుండి నూతన ఆర్థిక విధానాలు భారతదేశంలో అమలు చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా రాను రాను ప్రైవేటు పరం అవుతున్న పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వ రంగం పోవడం వల్ల రిజర్వేషన్లు కూడా రోజు రోజుకు తగ్గుతున్నాయని అన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని వారు కోరారు. మోడీ పాలనలో కార్పొరేట్ శక్తుల ఆస్తులు పెద్ద ఎత్తున పెరిగి పేదలు మరింత పేదలుగా మారారని అన్నారు. దేశంలో 35 కోట్ల మందికి సరైన తిండి లేదని, పౌష్టికాహారము అందడం లేదని తెలిపారు. ఇంకా విద్యా, వైద్యం పేదలకు సరిగా అందడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. రానున్న కాలంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడికి సమానత్వం, సమాన హక్కులు, అవకాశాలు, గౌరవం రాజ్యాంగం ద్వారా కల్పించబడిందన్నారు. కుల, మత, లింగ వర్గ భేదాలు లేకుండా సమానత్వం సాధన కోసం రాజ్యాంగం కృషి చేస్తుందని, బలహీన వర్గాల రక్షణ కోసం, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాల కోసం రాజ్యాంగంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆర్టికల్స్ రూపొందించారని తెలిపారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని మార్చి మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తేవాలని చూస్తుందని, దీనికి వ్యతిరేకంగా వామపక్షవాదులు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు పార్టీ మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య అధ్యక్షత వహించగా జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, అన్నంపట్ల కృష్ణ, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు మోటె ఎల్లయ్య, కొండపురం యాదగిరి, మధ్యపురం బాల్ నర్సింహ, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, ఎన్.పి.ఆర్.డి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, శాఖ కార్యదర్శులు ఏదునూరి వెంకటేష్, మచ్చ భాస్కర్, కొల్లూరి సిద్ధిరాజు, అనాజిపురం గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్ , మండల నాయకులు నరాల చంద్రయ్య, దయ్యాల మల్లెష్, బొల్లెపల్లి స్వామి, బండి శ్రీను, పాక జహంగీర్, మధు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.