ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్
అసెంబ్లీలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బస్వాపురం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై తన గళం వినిపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బస్వాపురం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు, అసంపూర్తి పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, దీంతో పెండింగ్ లో ఉన్న పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పలుమార్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలు చేసి కొంత వరకు ఇప్పటికే పరిష్కార చర్యలు తీసుకున్నారన్నారు. రూ.30 కోట్ల వరకు నిర్వాసితులకు పరిహారం చెల్లించారని తెలిపారు. దీంతో కొంత మేరకు రిజర్వాయర్ లో నీళ్లు నింపే అవకాశం ఏర్పడిందన్నారు. వరంగల్ – హైదరాబాద్ మార్గంలో రాయగిరి వద్ద బైపాస్ రోడ్డు కటింగ్ చేసి కల్వర్టు నిర్మించడం ద్వారా కాలువకు నీళ్లు విడుదల చేసే మార్గం సుగమం చేశారన్నారు. దీంతో బునాదిగాని కాలువలోకి గోదావరి నీళ్లు పారుతూ భువనగిరి, వలిగొండ మండలాల్లోని 20కి పైగా చెరువులు, కుంటలు నిండే అవకాశం ఏర్పడిందన్నారు. ఇందుకు మంత్రి ఉత్తమ్ కు కృతజ్ఞతలు చెబుతున్నామని తెలిపారు. అయితే అక్కడక్కడ కాలువలపై ఓటీలు, ఫీడర్ కెనాల్స్ నిర్మించాల్సి ఉందన్నారు. ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.134కోట్లు పెండింగ్ నిధులు ఇవ్వాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని కోరారు.