తట్టెడు మట్టి కూడా తీయలేని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
సుల్తాన్ పూర్ నుంచి పహాడీ షరీఫ్ రోడ్డు పనులకు జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసి సంవత్సరానికిపైగా గడిచినా, తట్టెడు మట్టి కూడా తీయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బడంగ్ పేట్ నుంచి నాదర్ గూల్ వరకు రోడ్డు అభివృద్ధితో పాటు ఇతర పనులకు రూ. 150 కోట్ల టెండర్ వేయడం జరిగింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ, అనేక అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని అన్నారు. ముఖ్యంగా సుల్తాన్ పూర్ నుంచి పహాడీషరీఫ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి సంవత్సరానికి పైగా గడిచినా, తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు రోడ్ల అభివృద్ధి కోసం శిలాఫలకాలను ప్రారంభించారు. హంగామా చేశారు. ఫోటోలు దిగారు వెళ్లిపోయారు. ఇప్పటి వరకు ఎక్కడ వేసిన శిలాఫలకాలు అక్కడే ఉన్నాయి, కానీ తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు. అత్యవసర రహదారి పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రద్దీగా ఉండే ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు రోజూ కష్టాలు పడుతున్నప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హడావిడిగా శిలాఫలకాలు వేసి పనులు ప్రారంభించకపోవడం వల్ల ప్రజలను మోసం చేస్తున్నట్లే. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పాలన కొనసాగాలి కానీ, ఇబ్బందులకు గురి చేసే విధంగా కాదని ఆమె స్పష్టం చేశారు. తక్షణమే మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసిన అన్ని పనులను వేగవంతంగా ప్రారంభించి పూర్తి చేయాలని అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రా రెడ్డి డిమాండ్ చేశారు.